Trishul News

జగనన్న కాలనీలు త్వరితగతిన సిద్ధం చేయండి - నెల్లూరు కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నవరత్నాలు పధకంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ గృహాలు అందించే కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక వసతులను కల్పించి, లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించాలని అధికారులను కమిషనర్ హరిత ఆదేశించారు. జగనన్న కాలనీల ప్రగతిపై అధికారులు, సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో గృహాల నిర్మాణాలకై లబ్ధిదారులకు ప్రోత్సాహం కలిగించే దిశగా కొన్ని కాలనీల్లో అందమైన మోడల్ గృహాలను నిర్మించి ప్రదర్శనకు ఉంచాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, గృహ రుణాలను వేగవంతంగా మంజూరు చేయించాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ప్రస్తుతం బేస్ మెంట్ పూర్తయిన గృహాలు, స్లాబ్ పూర్తి చేసుకున్న గృహాల వివరాలను రూరల్, నగర నియోజకవర్గాల వారీగా అడిగితెలుసుకున్న కమిషనర్ మౌలిక వసతులను కూడా త్వరగా ఏర్పాటు చేసేలా పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత, పారదర్శకత పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులు కొంతమంది ప్రస్తుతానికి నగర పరిధిలో అందుబాటులో లేరని, వారిని సంప్రదించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో తాత్కాలికంగా స్థిరపడిన గృహాల లబ్ధిదారులకు సమాచారం అందించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి డిసెంబర్ నెల 21వ తేదీ నాటికి లబ్ధిదారులకు అందుబాటులోకి తేవాలని అధికారులను కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్.ఈ సంపత్ కుమార్, సెక్రటరీ హేమావతి, హౌసింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post