Trishul News

జనవరి 27 నుండి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర..!

- 4వేల కిలోమీటర్లు.. 400 రోజులు పాదయాత్ర
- కుప్పం నుండి ప్రారంభం కానున్న యువగళం
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల 27న కుప్పం నుంచి ఆయన మహా పాదయాత్రగా జనక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. లోకేష్‌ మహా పాదయాత్రకు "యువగళం" పేరును పార్టీ ఖరారు చేసింది. ఎన్టీఆర్ భవన్‌లో యువగళం జెండాను పలువురు నాయకులు ఆవిష్కరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా.. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ జనవరి 27నుంచి మహాపాదయాత్రకు.. సిద్ధమయ్యారు. పాదయాత్రకు 'యువగళం' పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలను.. పార్టీ సీనియర్‌ నేతలు ప్రకటించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యువగళం జెండాను అచ్చెన్నాయుడు, నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌బాబు, చినరాజప్ప, షరీఫ్‌, అనితలు ఆవిష్కరించారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభమయ్యే యాత్ర.. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు సాగుతుందని వెల్లడించారు.
యువగళంలో పాల్గొనేందుకు ఓ నెంబర్

రాష్ట్రానికి పెట్టుబడులు రాక, ఉపాధి లేక నిరాశ నిస్పృహల్లో ఉన్న యువతకు.. భరోసా ఇచ్చేందుకు యువగళం పాదయాత్ర ఓ వేదికని పార్టీ నేతలు వెల్లడించారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చిన యువత సమస్యలను తెలుగుదేశం అధ్యయనం చేసింది. యువగళం వేదికను రాష్ట్ర యువతకు పరిచయం చేసి నడిపించే బాధ్యతను అధిష్ఠానం లోకేష్​కు అప్పగించింది. రాష్ట్రంలో కోటీ 50 లక్షల మందికి పైగా నిరుద్యోగులున్నారని అంచనా వేశారు. నిరుద్యోగ సమస్యతో ప్రతి నాలుగు రోజులకు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రతి 8 గంటలకు ఒక మహిళ అఘాయిత్యానికి గురవుతోందని అధ్యయనంలో పేర్కొన్నారు. 9686296862 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి యువగళంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే వేదికగా 'యువగళం' ఏపీని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనేది టీడీపీ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడ్డారని విమర్శించారు. వైసీపీ విధ్వంసకర నిర్ణయాలు తీసుకుంటోందని.. రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా... ఉన్నవాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రూ.17 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని.. నిరుద్యోగ భృతి పెట్టి లక్షలమంది యువకులకు అవకాశమిచ్చామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో జగన్‌ విఫలమయ్యారని విమర్శించారు. నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు పెరిగిపోయిన పరిస్థితి వచ్చిందని, యువతకు టీడీపీ ద్వారా సరైన వేదిక ఏర్పాటుకు లోకేశ్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. యువతకు లోకేష్​ నాయకత్వం వహిస్తున్నారని.. నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే వేదికగా 'యువగళం' అని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో 400 రోజులు లోకేశ్‌ పాదయాత్ర చేస్తారని స్పష్టం చేశారు.
నాయకుడే ప్రజలను కలుసుకునేందుకు వెళ్తున్నారు.
లోకేశ్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించారని టీడీపీ నేత చినరాజప్ప తెలిపారు. లోకేశ్‌ పాదయాత్రకు ప్రజలు అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నాయకుడే ప్రజలను కలుసుకునేందుకు వెళ్తున్నారని పార్టీ నేత షరీఫ్‌ వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

మహిళల్లో ధైర్యం నింపేదుకే యువగళం

మహిళా సమస్యల పరిష్కారానికి లోకేశ్‌ పాదయాత్ర వేదికగా నిలుస్తుందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. మహిళల్లో ధైర్యాన్ని నింపేందుకే 'యువగళం' అని పేర్కొన్నారు. జగన్ పాలనా పగ్గాలు చేపట్టాక.. కీచక పాలన మొదలైందని విమర్శించారు.
యువతకు నారా లోకేష్​ దిక్సూచి

రాష్ట్రంలోని ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించేందుకే లోకేశ్‌ పాదయాత్ర చేపడుతున్నట్లు కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. లోకేశ్‌ పాదయాత్రలో పెద్దఎత్తున యువత పాల్గొనాలని కోరారు. యువత శక్తిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. యువతను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని.. అందుకు గాను లోకేశ్‌కు యువత సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. యువతకు నారా లోకేష్​ దిక్సూచిగా నిలవబోతున్నారని తెలిపారు. జగన్‌ను గద్దె దించేందుకు యువత సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post