Trishul News

కాలిఫోర్నియాలో కాల్పులు.. 6 నెలల పాపతో సహా ఆరుగురు మృతి..!

అమెరికా, త్రిశూల్ న్యూస్ :
అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. గన్‌ కల్చర్‌ అమెరికాలో మరోసారి సామాన్య పౌరుల ప్రాణాలు తీసింది. కాలిఫోర్నియాలోని ఓ ఇంటిపై సోమవారం తెల్లవారుజామున ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఆరు నెలల పాప, ఆమె తల్లితో సహా ఆరుగురు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కాల్పులు మాదకద్రవ్యాల ముఠాతో ముడిపడి ఉండొచ్చని తులారే కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన షెరీఫ్ మైక్ బౌడ్రేక్స్ వివరించారు. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనేకసార్లు కాల్పులు జరిపి ఇంటిపై దాడి చేసినట్లు తాము భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘‘ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నాం. ఈ హత్యలకు ముఠాలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చు’’ అని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు భవనం లోపల దాక్కుని దాడి నుంచి బయటపడ్డారు. అయితే చాలా మంది క్షతగాత్రులకు స్థానికులు అత్యవసర వైద్య సహాయం అందించారు. క్షతగాత్రులలో ఒకరు ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందారు. ఈ దాడి డ్రగ్స్‌కు సంబంధించిందని అని షెరీఫ్ తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన చర్య కాదని.. కావాలనే ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్లు తాము భావిస్తున్నామన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో 2021లో తుపాకీ కాల్పుల వల్ల సుమారు 49,000 మంది మరణించారు. దేశంలో ప్రజల కంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. ముగ్గురిలో ఒకరు కనీసం ఒక ఆయుధాన్ని కలిగి ఉంటారు. ఇదిలా ఉండగా కెనడాలో కూడా కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపగా అతడు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment

Previous Post Next Post