ఆస్ట్రేలియా ప్రభుత్వ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్(SVP) లో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం
- ఆహ్వాన లేఖను పంపిన ఆస్ట్రేలియన్ హైకమిషన్
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (Special Visits Program)లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. గత 20 ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని, 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా SVPలో భాగస్వాములయ్యారని వెల్లడించింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు.. ముఖ్యంగా విద్యారంగం, నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుంది.

No comments:
Post a Comment