శ్రీ సిటీ, త్రిశూల్ న్యూస్ -
రానున్న వినాయక చవితి, గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు ముందస్తుగా ఆన్లైన్ అనుమతి పొందడం తప్పనిసరి అని హైటెక్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ శ్రీమతి ఎం. ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తమ మండపాలు, విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్దేశిత ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, ముందుగానే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉత్సవ నిర్వాహకుల సౌకర్యార్థం వివిధ శాఖలకు సంబంధించిన అనుమతులను ఒకే వేదిక ద్వారా పొందేలా ఆన్లైన్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
- శాంతిభద్రతలకు ప్రాధాన్యం
గణేష్ ఉత్సవాల సందర్భంగా *శాంతిభద్రతలు, ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం* ఇస్తామని ఎస్ఐ ప్రియాంక స్పష్టం చేశారు. పోలీసు శాఖతో పాటు సంబంధిత శాఖల నుంచి అవసరమైన ముందస్తు అనుమతులు పొందిన తర్వాతే మండపాల ఏర్పాటు, ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మండపాల ఏర్పాటు వల్ల ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాల సమయంలో నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు నిర్వాహకులు పూర్తిస్థాయిలో సహకరించాలని తెలిపారు.
- అవాంఛనీయ ఘటనలకు తావులేదు
గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ సూచించారు. ఉత్సవాల పేరుతో *అల్లర్లు, గొడవలు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని,* నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కావున హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆన్లైన్ అనుమతి విధానాన్ని సద్వినియోగం చేసుకుని *ముందస్తుగానే అనుమతులు పొందాలని* ఎస్ఐ ఎం. ప్రియాంక కోరారు. ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆమె సూచించారు.

No comments:
Post a Comment