Trishul News

అంతా బాగుంటే రోజూ అప్పుల కోసం పరుగులెందుకు - సోము వీర్రాజు

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా చేశారని.. దీనికి వైకాపాతో పాటు తెదేపా కూడా కారణమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాజధాని పరిధిలోని ఉండవల్లి నుంచి గుంటూరు జిల్లా భాజపా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ 'మనం-మన అమరావతి' పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి సోము వీర్రాజు హాజరై మాట్లాడారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మోసం చేయలేదన్నారు. అమరావతిలో నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని.. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. కేంద్రం ఎక్కడా మోసం చేయలేదు. ఎయిమ్స్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్‌ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించాం. రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలను కూడా కేంద్రమే నిర్మిస్తుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి కేంద్రం కంటే బాగుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. కేంద్రం కంటే పరిస్థితి బాగుంటే.. కేంద్రమిచ్చిన బియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదు? అంతా బాగుంటే రోజూ అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారు? ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు రాజధాని ఎందుకు కట్టలేదు? రాజధాని రైతులను ఆదుకోవడంపై భాజపా దృష్టి సారిస్తుంది. పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ నివేదిక కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. జగన్‌ చెబుతున్న ప్రింటింగ్‌ మిషన్‌ కేంద్రం వద్ద ఉండదు. పోలవరం ఏటీఎం కాకూడదు అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

Post a Comment

Previous Post Next Post