Trishul News

చదువుల తల్లి ఉసురు తీసేసారు..!

- కన్నీరు పెట్టిస్తున్న ఆఖరి లేఖ
నందిగామ, త్రిశూల్ న్యూస్ :
నందిగామలో చదువుల తల్లి బంగారు బిడ్డ హరిత ఆత్మహత్య చేసుకోవడం గుండెలు పిండేస్తోంది. ఎంసెట్‌ లో హరిత 15 వేల ర్యాంకు సాధించింది. ఏ కాలేజీలోనైనా సీటు ఇట్టే వచ్చేస్తుంది. చదువంటే ప్రాణంగా భావించే హరిత తనకు తాను మరణ శాసనం ఎందుకు రాసుకుంది? తల్లికి భరోసాగా నిలబడాలని, అనుకున్న హరిత అంతలోనే బలవంతంగా ఎందుకు తనువు చాలించింది? ఇదే ఇప్పుడు హృదయాల్ని కలచివేస్తోన్న ప్రశ్న. నందిగామలోని రైతు పేటకు చెందిన ప్రభాకర్‌ రావు, అరుణ దంపతుల కూతురు హరిత. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబం క్రెడిట్‌ కార్డుపై తీసుకున్న మూడున్నర లక్షల రుణం దగ్గర అగ్గిరాజేసింది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన హరిత బీటెక్‌లో చేరాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే తండ్రి చేసిన అప్పు కట్టాలంటూ రికవరీ రౌడీలు ఇంటికొచ్చి బెదిరించారు. వాళ్లు టార్చర్‌ పెట్టిన తీరు ఆ అమ్మాయి మనస్సుని కలచివేసింది. తీసుకున్న అప్పు కట్టకపోతే ఇద్దరు కూతుళ్లతో గేదెలు కాయించు అంటూ రౌడీ ఏజెంట్‌ నోరు పారేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫైనాన్షియల్‌ ప్రొబ్లమ్‌ తెలిసిన హరిత ఇక చదువుకోలేననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.

మరికొద్ది రోజుల్లో బీటెక్‌లో చేరాల్సిన, బంగారు భవిష్యత్తు ఉన్న హరిత ఆత్మహత్య హృదయాలను కలచివేస్తోంది. అమ్మా నీకు భారం కాలేనంటూ ఆ బంగారు తల్లి తనువు చాలించింది. చెల్లి భవిష్యత్తుని తీర్చిదిద్దుకోమ్మని చెప్పి శాశ్వతంగా సెలవు తీసుకుంది. యమకింకరుల్లా మారిన రికవరీ రౌడీలపై ప్రజలు మండిపడుతున్నారు. దేశమంతా తిట్టిపోస్తున్నా వాళ్ల తీరు మాత్రం మారడం లేదు. బడాబాబులు వేల కోట్లు ఎగవేసి వెళ్లిపోతే.. ఏం చేయలేనివాళ్లు.. ఇలా సామాన్యులపై, రైతు కుటుంబాలను మాత్రం నిత్యం వేధిస్తున్నారు. ఇలాంటి వారు ఎలా ఛస్తే మాకేంటి అంటూ వాళ్లు సాగిస్తున్న వేధింపులు హడలెత్తిస్తున్నాయి. హరిత లేఖ రికవరీ ఏజెంట్ల దౌర్జన్యాలకి తెరదించుతుందా? పాలకుల కళ్ళు తెరిపిస్తుందా? ఇదే ఇప్పుడు యావత్‌ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రశ్న.

Post a Comment

Previous Post Next Post