- సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ విచారణార్హం
- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై గతంలో సీబీఐ దాఖలు చేసిన అక్రమ ఆస్తుల కేసుల్లో ఓ ప్రధాన కేసు అయిన వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ విచారణార్హం కాదని తేల్చి చెప్పింది. వాన్పిక్ ప్రాజెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ ఛార్జ్షీట్ను కొట్టి వేస్తూ.. వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. తాజా తీర్పుతో వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్కు ఎంతో ఊరట లభించినట్లయ్యింది. అంతేకాదు ఈ ప్రాజెక్టు ప్రమోటర్లలో ఒకరైన నిమ్మగడ్డ ప్రసాద్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఈ ఛార్జ్షీట్కు సంబంధించి నిందితులుగా ఉన్న వారందరికీ ఒకరకంగా ఈ తీర్పుతో పరోక్షంగా ఊరట లభించినట్లే. హైకోర్టు తీర్పుపై సీబీఐ తదుపరి చర్యలేవైనా ఉంటాయా.. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా అన్నది తేలాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేసే నిమిత్తం 2008లో అప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం.. వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్కు చేసిన భూకేటాయింపులకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ గతంలో సీబీఐ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కూడా ప్రధాన నిందితుడు. ఈ కేసుపై హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు సీబీఐ అధికారులు. దీన్ని సవాలు చేస్తూ వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఈ పిటిషన్పైనే కోర్టు తీర్పు వెల్లడించింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ చెల్లదంటూ తీర్పు చెప్పింది.హైకోర్టు తాజా తీర్పుతో వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి చేయతలపెట్టిన ఇండస్ట్రియల్ కారిడార్కు ఇప్పటి దాకా ఎదురైన న్యాయపరమైన అడ్డంకి చాలా వరకూ తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుపై దాదాపు పది సంవత్సరాలుగా న్యాయపరంగా పోరాడుతున్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు ఈ తీర్పుతో ఎంతో ఊరట లభించినట్లేనని చెప్పాలి. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన నిమ్మగడ్డ ప్రసాద్.. వాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల వల్ల గత 10 సంవత్సరాలుగా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ.. ఈ కేసుపై అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్నారు. ఎంతో డైనమిక్ పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన నిమ్మగడ్డ ప్రసాద్.. ఈ కేసుల కారణంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఏ పెద్ద పారిశ్రామిక ప్రాజెక్టునూ చేపట్టలేని విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వెనుకపడిన ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తే. .ఆ ప్రాంతం పారిశ్రామికంగా ముందుకెళ్లడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ మేలు జరుగుతుందని నిమ్మగడ్డ ప్రసాద్ బలంగా నమ్మేవారు. ఎన్నో ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్దరించిన నిమ్మగడ్డ ప్రసాద్ అందరికీ మాట్రిక్స్ ప్రసాద్గా సుపరిచితులు.
Tags:
తెలంగాణ