Trishul News

పార్లమెంటుపై దాడి కుట్ర భగ్నం.. 25 మంది అరెస్ట్..!

జర్మనీ, త్రిశూల్ న్యూస్ :
పార్లమెంటుపై దాడి కుట్రను భగ్నం చేసినట్లు జర్మన్ పోలీసులు బుధవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో ఫార్-రైట్ టెర్రర్ గ్రూప్‌నకు చెందిన దాదాపు 25 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 130కిపైగా ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి నిర్వహించిన ఈ దాడుల్లో 3,000 మందికిపైగా అధికారులు పాల్గొన్నారని, ఉన్నత స్థాయి ఉగ్రవాద నిరోధక యూనిట్లు కూడా సహకరించాయని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున దాడులు జరగడం ఇంత వరకు చూడలేదని జర్మన్ మీడియా చెప్తోంది. ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, సిటిజన్స్ ఆఫ్ ది రీచ్ సంస్థ సభ్యులపై ఈ దాడులు జరిగాయి. ఓ చిన్న సాయుధ బృందంతో జర్మన్ పార్లమెంటులో చొరబడేందుకు ఈ సంస్థ కట్టుదిట్టమైన ప్రణాళికను రూపొందించింది. వీరంతా కలిసి 2021 నవంబరునాటికి ఈ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చేసి, తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వీరు కుట్ర పన్నారు. అరెస్టయినవారిలో ఇద్దరిని ఆస్ట్రేలియా, ఇటలీలలో అరెస్టు చేశారు. ది రీయిష్‌బుర్జెర్ మువ్‌మెంట్‌లో నియో నాజీలు కూడా ఉన్నారు. వీరంతా ఆధునిక జర్మన్ రిపబ్లిక్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో వీరు భద్రతకు పెను ముప్పుగా మారారు. మాజీ సైనికులు కూడా ఈ సంస్థలో ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యవస్థలపై వీరికి తీవ్ర వ్యతిరేకత ఉంది. స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామిక వ్యవస్థను వీరు వ్యతిరేకిస్తున్నారు. సాయుధ పోరాటంతోనే తమ లక్ష్యం నెరవేరుతుందని ఈ ఉగ్రవాద సంస్థ సభ్యులు భావిస్తున్నారు. జర్మన్ న్యాయ శాఖ మంత్రి మార్కో బుష్‌మన్ ఇచ్చిన ట్వీట్‌లో, పోలీసులను ప్రశంసించారు. జర్మనీ తన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలదని ఈ అనుమానిత ఉగ్రవాద సంస్థ గుట్టును రట్టు చేయడం ద్వారా స్పష్టమవుతోందన్నారు.

Post a Comment

Previous Post Next Post