- మంత్రులకు కాంగ్రెస్ నేతల వినతి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర మంత్రులు
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో వైకుంఠ ద్వార ప్రవేశానికి స్థానికులకు రోజుకు 20వేల మందికి అవకాశం కల్పించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్య ప్రసాద్ లను కాంగ్రెస్ పార్టీ నేతలు కలసి వినతిపత్రం అందించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ తలప దామోదర్ రెడ్డి, ఎస్టి విభాగం అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, తిరుపతి జిల్లా కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిన్నే మల్లికార్జున్, తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఆమూరి కృష్ణమూర్తి తదితరులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం తిరుపతి స్థానిక ప్రజలకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారని చెప్పారు. టిటిడి నిర్వహించిన లక్కీ డిప్ ద్వారా కేవలం 100 మంది స్థానికులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం లభించలేదని వివరించారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ వేంకటేశ్వర స్వామిని గోవింద మాల ధరించిన భక్తులు దర్శించుకోవడానికి అలాగే స్థానిక ప్రజలు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. టిటిడి తీసుకున్న తాజా నిర్ణయంతో స్థానికుల్లో తీవ్ర నిరాశ, ఆవేదన కలుగుతోందని చెప్పారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని స్థానికులకు టీటీడీ కల్పించిన అవకాశంతో ఎక్కువమందికి వైకుంఠ ద్వార దర్శనం లభించదని చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకు రోజుకు 20వేల మందికి దర్శన సౌకర్యం కల్పించాలని లేనిపక్షంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికులకు ఇబ్బంది లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

No comments:
Post a Comment