- ఆగస్టు 5న అధిక ధరలపై ఆందోళనలు
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. వచ్చే నెల 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ రాష్ట్రాల నేతలకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పప్పులు, వంట నూనెలు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దీనికి తోడు చేపలు, పెరుగు, గోధుమ పిండి, తేనె వంటి వివిధ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. అగ్నిపథ్ స్కీం ద్వారా యువత ఆశలు చెదిరిపోయాయి'' అని వేణు గోపాల్ అభిప్రాయపడ్డారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా హౌజ్ లోపల, బటయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే నెల 5న జరగనున్న కాంగ్రెస్ నిరసనల్లో కాంగ్రెస్ తరఫున చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులతోపాటు, రాష్ట్రాలు, జిల్లాల ఇంచార్జిలు, కార్యకర్తలు పాల్గొంటారు. గ్రామీణ స్థాయి నుంచి దేశ రాజధాని వరకు ఈ నిరసనలు జరుగుతాయిన కాంగ్రెస్ తెలిపింది. రాష్ట్ర రాజధానుల్లో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
Tags:
జాతీయం