Trishul News

వాణిజ్య ప్రకటనలపై పన్నుల వసూళ్లు పెంచండి - కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నగర వ్యాప్తంగా ఉన్న ప్రకటన హోర్డింగ్స్ లపై ప్రత్యేక దృష్టి సారించి యాడ్ ఏజెన్సీల నుంచి నిర్దేశించిన పన్నులను వసూలు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని ముందుగా డయల్ యువర్ కమిషనర్ ద్వారా 17 ఫిర్యాదులను అందుకున్నారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు సంబంధిత విభాగాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాల్లో వాణిజ్య ప్రకటనలను గుర్తించి రెవెన్యూ వసూళ్లను పెంచాలని సూచించారు. ప్రతి ఒక్క నోడల్ అధికారీ సంబంధిత సచివాలయాలను సందర్శించి పనితీరును పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయ కార్యదర్శుల విధి నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. నిర్దేశించిన గడువు దాటినప్పటికీ నగర పాలక సంస్థలోని కొన్ని విభాగాల్లో స్పందన ఫిర్యాదులు ఇంకా పెండింగులో ఉన్నాయని, సూచించిన గడువులోపు పరిష్కరించాలని కమిషనర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందనలో అన్ని విభాగాల అధికారులు ఓకే వేదికలో అందుబాటులో ఉంటారు కావున సమస్యల పరిష్కారం సులభతరం అవుతోందని, అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూచించారు. స్పందన వేదికలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్.ఈ సంపత్ కుమార్, ఎమ్.హెచ్.ఓ డాక్టర్ వెంకట రమణ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post