Trishul News

సారె ఊరేగింపు మార్గంలో ఏర్పాట్లు చేయండి - కమిషనర్ అనుపమ

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుండి తీసుకువచ్చే సారె ఊరేగింపు మార్గంలో పారిశుద్ధ్యం, తదితర ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి ఇంజినీరింగ్, పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పంచమీ తీర్థం రోజున తిరుమల శ్రీవారి నుండి అమ్మవారికి సారె తీసుకురానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సారె ఊరేగింపు జరగనున్న మార్గంలోని అలిపిరి, వివేకానంద కూడలి, కోమలమ్మ సత్రం, చిన్నబజారు వీధి, పూలవీధి, ఉత్తర మాడావీధి, బండ్లవీధి, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, సుబ్బలక్ష్మి కూడలి, రామానుజ కూడలి, లక్ష్మీపురం కూడలి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య, రోడ్డు పనులను అధికారులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పంచమీతీర్థం రోజున సారె ఊరేగింపు జరిగే మార్గాల్లో రోడ్డు లో ఎటువంటి గుంతలు లేకుండా పూడ్చి తారు రోడ్డు వేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎక్కడా చెత్త చెదారం లేకుండా తగుచర్యలు తీసుకోవాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. సారెతో పాటు వచ్చే భక్తులకు, అధికారులకు, సిబ్బందికి ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, డి.ఈ. లు దేవిక, గోమతి, రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post