Trishul News

బీసీల సంక్షేమంపై చర్చకు సిద్ధమా? - సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

కావలి, త్రిశూల్ న్యూస్ :
ఎన్టీఆర్ వెనకబడిన వర్గాలను ముందుకు నడిపించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. కావలిలో ఇదేం ఖర్మ బీసీలకు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి రాకముందు బీసీలను కేవలం ఓటర్లుగానే చూశారన్నారు. ఎన్టీఆర్ హయాంలో వెనకపడ్డ వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. బీసీలకు టీడీపీ ఎప్పుడూ ఉన్నతమైన పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 50 శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుచేస్తే సీఎం జగన్ దానిని 24 శాతానికి తగ్గించారని ఆరోపించారు. సీఎం అయిన వెంటనే బీసీల అభివృద్ధికే మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. నీతి నిజాయితీ కలిగిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై అక్రమంగా కేసులుపెట్టి పైశాచిక ఆనందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీల సంక్షేమంపై తొలి సంతకం..!

టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమ అంశంపై తొలి సంతకం పెడతానని అధినేత చంద్రబాబు వెల్లడించారు. సీఎం జగన్కు బీసీలు రిటర్న్గిఫ్ట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. బీసీల కులవృత్తులను సీఎం జగన్ కించపరుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రజకులు దుస్తుల తరహాలోనే జగన్ను ఉతికి ఉతికి ఆరేయాలన్నారు. రజకులకు ఆధునిక పరికరాలు ఇచ్చి కులవృత్తుల గౌరవం కాపాడామని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీ సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బీసీల సంక్షేమంపై చర్చకు జగన్ సిద్ధమా? అని చంద్రబాబు సవాల్ చేశారు. చేపలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, వలలిచ్చి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం బతుకుతారనేది టీడీపీ సిద్ధాంతమన్నారు.

Post a Comment

Previous Post Next Post