Trishul News

నారా లోకేష్ పాదయాత్రకు మైలేజ్ ఇచ్చే పనిలో జగన్ సర్కార్..!

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ `వై నాట్ 175` అంటోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలంటే హడలిపోతోంది. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. భయం లేకుంటే అడ్డుకోవడమెందుకు ? బ్రిటీషు కాలం నాటి జీవోలెందుకు ? ప్రజల పై నమ్మకం లేదా ? లేదా తమ పాలనపైనే నమ్మకం లేదా ? ఏపీలోని అధికార పార్టీ తీరుపై సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్నలివి. ఏపీలో నారా లోకేష్ పాదయాత్ర జనవరి 27 నుంచి కుప్పంలో ప్రారంభమవుతోంది. 4000 వేల కిలోమీటర్లు.. 400 రోజులు లోకేష్ పాదయాత్ర సాగుతుంది. లోకేష్ పాదయాత్రపై ఏపీ ప్రభుత్వం తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పాదయాత్ర గురించి ఏపీ పోలీసులు అడిగిన ప్రశ్నలు విడ్డూరంగా ఉన్నాయి. నారా లోకేష్ పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారు ? ఏ ఊర్లో ఎవరిని కలవబోతున్నారు ? ఎన్ని వాహనాలు వెంట వెళ్తాయి ? వాటి నెంబర్లు ఏంటి ? ఇవీ పోలీసులు అడిగిన ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు ఇంకెన్నో. ఏ ఊర్లో లోకేష్ ఎవరిని కలుస్తారో ఇప్పుడే ఎలా చెప్పగలరు. ప్రతి ఊర్లో వందలాది మంది పాదయాత్రకు వస్తారు. వారి సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదంతా అప్పటికప్పుడు జరుగుతుంది. ముందస్తు ప్రణాళికతో జరిగేది కాదు. ఇలాంటి అంశం పై పోలీసులు సమాచారం అడగటం అనుమానాలకు తావిస్తోంది. వాహనాల నెంబర్లు ముందుగానే ఎలా ఇవ్వగలరు. కొంచెమనైనా ఆలోచన ఉండాలి కదా. కొన్ని టీడీపీ నేతల సొంత వాహనాలు ఉంటాయి. మరికొన్ని అద్దె వాహనాలు ఉంటాయి. అద్దె వాహనాల నెంబర్లు ముందుగా ఎలా ఇవ్వగలుగుతారు. గతంలో సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేశారు. రాష్ట్రమంతా తిరగారు. నారా లోకేష్ ను అడిగిన ప్రశ్నలు.. అప్పట్లో సీఎం జగన్ ను కూడ అడిగారా ? వైసీపీ వారు ఆ సమాచారం ఇచ్చారా ? . ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడెందుకు ఇలాంటి ప్రశ్నలు. ఒంటి నిండా భయం పెట్టుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కాకపోతే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ తండ్రి వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చంద్రబాబు పాదయాత్ర చేశారు. చంద్రబాబు హయాంలో జగన్ పాదయాత్ర చేశారు. వీరందరి పాదయాత్రలకు లేని అడ్డంకులు ఇప్పుడెందుకన్న ప్రశ్న ప్రతిపక్షాలు వేస్తున్నాయి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టీడీపీ ఇలా చేసి ఉంటే.. జగన్ పాదయాత్ర చేసి ఉండేవారా ? అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఇటీవల జీవో నెంబర్ 1 తెచ్చి వైసీపీ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కింది. ఇప్పుడు చచ్చు ప్రశ్నలతో పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నది. ఇలా చేస్తే నారా లోకేష్ పాదయాత్రకు వైసీపీనే హైప్ క్రియేట్ చేసినట్టువుతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా వైసీపీ వ్యవహరిస్తోందా? అన్న ప్రశ్న రాక మానదు. ప్రభుత్వానికి భయం లేకుంటే పాదయాత్రలకు, ప్రతిపక్షాల సభలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో ప్రశ్నించుకోవాలి. తమ పాలనపై నమ్మకం లేకపోతేనే ఇలాంటి నియంత పోకడలను అవలంబిస్తారని జనం గుసగుసలాడుతున్నారు. వందల మంది సలహాదార్లు ఉండి వైసీపీ ప్రభుత్వం ఇంతటి చచ్చు వ్యూహాలు అవలంభిస్తోందని చెవులు కొరుక్కుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post