Trishul News

హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి నరికేశారు..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
జియాగూడలో ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో స్వైరవిహారం చేశారు. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. ఆదివారం సాయంత్రం అందరూ చూస్తుండగానే హైదరాబాద్‌లోని పురానాపూల్‌ సమీపంలో జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఈ దారుణ ఘటన జరిగింది. జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు.. అతన్ని మరో ముగ్గురు తరుముకుంటూ వచ్చారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు.సమాచారం తెలుసుకున్న కుల్సుంపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి ఆధార్‌ కార్డు వివరాల ప్రకారం.. కోఠి ఇస్తామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌(32)గా పోలీసులు గుర్తించారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితులు ఎవరు? ఎందుకు అతన్ని హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు హత్య చేసి పక్కనే ఉన్న మూసీ నదిలో దూకి పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కుల్సుంపుర సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు. ముగ్గురు చుట్టుముట్టి ఒక వ్యక్తిని కిరాతకంగా నరుకుతున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. పోలీసుల దర్యాప్తునకు ఈ వీడియో కీలకంగా మారింది.

Post a Comment

Previous Post Next Post