Trishul News

తొమ్మిదో తరగతి విద్యార్థినికి కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రసవం..!

వాల్మీకిపురం, త్రిశూల్ న్యూస్ :
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో తొమ్మిదివ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ప్రసవించింది. హాస్పిటల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల అమ్మాయి ప్రసవించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అధికారుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం బాలికలో మార్పులు ఎందుకు గుర్తించలేకపోయిందన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఆ అమ్మాయి గర్భవతి అవ్వడానికి కారణం ఎవరో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం చెందిన బాలిక వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో చేరింది. ప్రస్తుతం విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో.. వెంటనే హాస్టల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విద్యార్థినిని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు స్కాన్ చేసి ప్రెగ్నెంట్ అని నిర్ధారించగా.. గంటల వ్యవధిలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మార్వో, ఎస్సై హాస్పిటల్‌కి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. వివరాలు తెలుసుకునేందుకు బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. మేనమామనే బాలిక గర్భం దాల్చడానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. స్థానిక ఎమ్మార్వో, ఎస్సై విషయాన్ని జిల్లా కలెక్టర్ విజయరామరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదని ఫైరయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

Previous Post Next Post