Trishul News

డిజిటల్‌ కార్పొరేషన్‌ పేరుతో జగన్‌ భారీ మాయ..!

- వైసీపీ సోషల్‌ మీడియా ఖర్చు అందులోనే

- ఐప్యాక్‌కు దోచి పెట్టిందీ ప్రజా ధనమే

- పేటీఎం బ్యాచ్‌కు పంచిందీ ఖజానా నుంచే

- ఐ అండ్‌ పీఆర్‌లో స్కామ్‌ మూలాలు!

- విచారణ జరిపితే మొత్తం వెలుగులోకి
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
‘విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్‌’ అని ఇప్పటికీ చక్కటి కబుర్లు చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏం చేశారో తెలుసా... ఒకే ఒక్క ఏడాదిలో రూ.1800 కోట్లకుపైగా ప్రజాధనాన్ని తన ‘సోషల్‌ మీడియా’ ప్రచారానికి ఖర్చు పెట్టేశారు. సజ్జల భార్గవ్‌ రెడ్డి నేతృత్వంలో నడిచిన వైసీపీ సోషల్‌ మీడియా విభాగం... వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ‘ఐ ప్యాక్‌’ ఖర్చునూ జనంపైనే రుద్దేశారు. ‘ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌’ పేరుతో ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి... ప్రజాధనాన్ని మళ్లించి, అదే డబ్బును తన సొంత పార్టీకి సేవ చేసిన సంస్థలకు కట్టబెట్టారు. ఇవీ.. ముఖ్యమంత్రిగా జగన్‌ పాటించిన విలువలు! ఇదీ... ఆయన విశ్వసనీయత! ఔట్‌ సోర్సింగ్‌ వ్యవస్థను జగన్‌ తన అక్రమాలకు వేదికగా మలుచుకున్నారు. చంద్రబాబు హయాంలో చివరి ఏడాది 2018-19లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం ఖర్చు రూ.864కోట్లు. అదే జగన్‌ హయాంలో చివరి ఏడాది 2023-24లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం ఖర్చు ఏకంగా రూ.2861 కోట్లకు చేరింది. అంటే... మూడింతలకు మించి పెరిగింది.

నామమాత్రంగా పెంపు..!!

11వ పీఆర్సీ కారణంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు నామమాత్రంగా పెరిగాయి. కొందరికి అసలు పెరగనేలేదు. మొత్తంగా వారి వేతనాలు రూ.864 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెరిగినట్లు అంచనా! కానీ... 2023-24లో ఈ ఖర్చు రూ.2861 కోట్లకు పెరిగింది. ఆయా శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు భారీగా పెరిగారా అంటే అదీ లేదు. జగన్‌ హయాంలో కొత్తగా వచ్చింది ‘ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌’ ఒక్కటే! దీన్ని ఫక్తు వైసీపీ ప్రచార సంస్థగా వాడుకున్నారు. వైసీపీ సోషల్‌ మీడియా, ఐప్యాక్‌తోపాటు ‘పేటీఎం బ్యాచ్‌’ పేమెంట్లన్నీ దీనిద్వారానే జరిగినట్లు అనుమానాలున్నాయి. ఫలితంగానే... 2023-24లో ఔట్‌ సోర్సింగ్‌ వేతనాల భారం పెరిగిందని అంచనా!

మాయ లెక్కలు..?

డిజిటల్‌ మీడియా కార్పొరేషన్‌ అనేది మాయా ప్రపంచం! ఎంతమంది, ఎక్కడ ఏం పనిచేస్తున్నారో ఎవరికీ తెలియదు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా ఆఫీసుకు రానివాళ్లు, భార్యాభర్తలు, వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర బడ్డీ కొట్టు నడిపే వాళ్లూ ఇందులో ఉద్యోగులే! జగన్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు విష వ్యూహాలు రచించిన ఐప్యాక్‌ సంస్థకు వందల కోట్లు చెల్లించారు. ఈ డబ్బంతా ప్రజలు కట్టిన పన్నుల నుంచి చెల్లించిన సొమ్మే. రెండేళ్ల క్రితం ఐప్యాక్‌ ఉద్యోగులందరినీ సజ్జల భార్గవ్‌ ఆఫీసుకు తరలించారు. వీరందరికీ ఔట్‌ సోర్సింగ్‌ పద్దు నుంచే జీతాలు చెల్లించారు. ఏపీసీఎ్‌ఫఎస్‌ఎ్‌సలో(ఏపీ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌) పేరిట మరో సంస్థను ఏర్పాటు చేశారు. అందులో... దాదాపు 400 మందిని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు. భారీ జీతాలు! చేసే పనిమాత్రం... టీడీపీ, జనసేన నేతలు, సానుభూతిపరులపై అసభ్యకర పోస్టింగులు పెట్టడమే. ఇక సజ్జల భార్గవ్‌ తన సోషల్‌ మీడియా కార్యాలయాన్ని విజయవాడలోని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ భవనంలో నిర్వహించారు. వందల కొద్దీ ఉద్యోగులను చేర్చుకున్నారు. వీరి జీతాలు ఖజానా నుంచే చెల్లించారు.

అరెస్టైన వారికి అందలం..

జడ్జిలపై దూషణ కేసులో అరెస్టైన 11 మంది డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వమే కోర్టు ఖర్చులు భరించింది. కేసుల నుంచి బయటకు వచ్చాక వారందరికీ ప్రమోషన్లు కల్పించి లక్షల్లో జీతం ఇచ్చింది. ఇందులో ఒక మహిళా ఉద్యోగిని ఏకంగా డిజిటల్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమించి నెలకురూ.2.5 లక్షల జీతం ఇచ్చారు. ఇదంతా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పద్దు నుంచి వెళ్లినవే. అలాగే, ఏపీ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో కూడా వందల సంఖ్యలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకున్నారు. జగన్‌ హయాంలో ప్రభుత్వానికి ఉపయోగపడేలా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం ఒక్కటీ జరగలేదు. అప్పటికే ఉన్న వారందరినీ ఒక్క కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చి దానికి ‘ఆప్కాస్‌’ అనే పేరు పెట్టారు. ఇందులో చాలా కార్పొరేషన్లలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను, శానిటేషన్‌ వర్కర్లను చేర్చనేలేదు. టీడీపీ హయాంలో నియమితులై... రూ.40వేల కంటే ఎక్కువ జీతమున్న వారందరినీ తప్పించి సొంత మనుషులను కూర్చోబెట్టారు. ‘ఆప్కాస్‌’కు నిధులు విడుదల చేయలేదు. కానీ... డిజిటల్‌ కార్పొరేషన్‌తోపాటు వైసీపీ సేవచేసిన సంస్థలకు నిధులు గుమ్మరించారు. ఈ గుట్టంతా ఐ అండ్‌పీఆర్‌లో ఉందని, విచారణ చేస్తే బయటకు వస్తుందంటున్నారు.

Post a Comment

Previous Post Next Post