Trishul News

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి - హోంమంత్రి అనిత

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని ఆమె తెలిపారు. మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు. పోలీసులు ప్రజల కోసం చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేతనాలు, బకాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. పోలీసు శాఖను కిందిస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తామని ఆమె వెల్లడించారు. గతంలో పోలీసులు నాపైనే అట్రాసిటీ కేసు పెట్టారని హోంమంత్రి గుర్తు చేశారు. చాలా మంది ఐపీఎస్‌లు జగన్‌కు, వైఎస్సార్సీపీకి తొత్తులుగా పనిచేశారని ఆమె విమర్శించారు. గత ఐదేళ్లలో చాలామంది ఐపీఎస్‌లు వారి గౌరవాన్ని తగ్గించుకున్నారని అన్నారు. ఐపీఎస్‌లు, పోలీసు అధికారుల గౌరవాన్ని పెంచేలా మా పాలన ఉంటుందని అనిత స్పష్టం చేశారు. పోలీసు అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని హోంమంత్రి హెచ్చరించారు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ ఆలోచనలతోనే పనిచేసే అధికారులను ఉపేక్షించమని తెలిపారు. అన్యాయం చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలన్నారు.

Post a Comment

Previous Post Next Post