Trishul News

త్వరలో హైదరాబాద్‌ తరహాలో అమరావతి పునః నిర్మాణం - సీఎం. చంద్రబాబు

- 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా తెలుగు ప్రజలు

- తిరుమలలో ప్రతి నిత్యం గోవింద నామ స్మరణ ప్రతి ద్వనించాలి 

- రాష్ట్ర ముఖ్యమంత్రి వ‌ర్యులు నారా చంద్రబాబు నాయుడు
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
 దేశం, రాష్ట్రంలోని ప్రజలందరు సిరిసంపదలతో ఆనందంగా జీవించాలని, ఆర్థిక అసమానతలను తొలగించి, త్వరలో "పేదరిక రహిత రాష్ట్ర స్థాపనకు శక్తిని" ప్రసాదించమని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించినట్లు రాష్ట్ర ముఖ్యంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలోని శ్రీ గాయత్రీ నిలయం విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం మాట్లాడుతూ,
2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా ఆవిర్భవిస్తుందని, ఇందులో తెలుగువారిని నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు తనకు శక్తిని ప్రసాదించమని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. తాను ఈ ప్రాంత స్థానికుడు కావడంతో ప్రతి రోజు శ్రీవేంకటేశ్వర స్వామి స్మరణతోనే తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, తన పాఠశాల, కళాశాల రోజుల్లో శ్రీనివాసమంగాపురం, తిరుపతికి నడిచి వెళ్లే సమయంలో తిరుమల శ్రీవారిని స్మరించుకున్నట్లు చెప్పారు. “శ్రీవేంకటేశ్వర స్వామి తమ కులదైవమని, గతంలో తనపై జరిగిన క్లైమోర్‌ మైన్‌ దాడి, గత ఐదేళ్లలో రాజకీయ దాడులతో సహా తన జీవితంలో ఎదుర్కొన్న అన్ని పోరాటాలు, సవాళ్లను శ్రీవారి ఆశీర్వాదం మరియు నా కుటుంబ సభ్యుల మద్దతుతో తాను ధైర్యంతో అధిగమించానన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి క్షీణించిందని, శ్రీవేంకటేశ్వరుని అనుగ్రహంతో మనమందరం కలిసి పునఃరుద్ధరించాలన్నారు. ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని "తిరుమల పవిత్రతను కాపాడటం"తో ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. తిరుమలను ప్రతి హిందూ భక్తుడు తన జీవితకాలంలో తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకునన్నారు. తిరుమలలో అనునిత్యం గోవింద నామ స్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని ఆ దిశగా తాను అడుగులు ముందుకు వేస్తారని తెలిపారు. ఈ లక్ష్యాలన్నింటిని సాధించడానికి తగినంత శక్తిని అనుగ్రహించమని తాను శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు పునరుద్ఘాటించారు.

Post a Comment

Previous Post Next Post