- అందరిలో ఐక్యాతా భావాన్ని పెంచే పండుగ వినాయక చవితి
- రూ.30 కోట్లతో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం
- విజయవాడలో మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం
విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించానని చెప్పారు. విజయవాడ సితార సెంటర్లో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...దేశంలో ప్రజలంతా ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయకచవితి అని అన్నారు. గణేష్ చతుర్థతి అంటే తనకు నాకు చాలా ఇష్టమని, చిన్నతనం నుంచి ఈ పండుగను బాగా చేసుకునే వాళ్లమని అన్నారు. డూండీ గణేశ్ సేవా సమితి నిర్వహించినట్టే తామూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించే వారమని సీఎం అన్నారు.
రాష్ట్రంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
గత ప్రభుత్వంలో గణేశ్ ఉత్సవాలు చేసుకోవాలంటే అన్నీ విఘ్నాలే. పండుగ చేసుకోవాలన్నా, మైక్ పెట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. ప్రతి దానికీ అనుమతులు తీసుకోవాలని ఇబ్బందులు పెట్టారు. కానీ మన ప్రజా ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా గణేశ్ మండపాలను ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.30 కోట్ల భారం పడుతుంది. అయినప్పటికీ భక్తుల సౌలభ్యం కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
జలాశయాల్లో పుష్కలంగా నీరు
దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి, సంక్షేమం మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేసి వాడవాడలా బ్రహ్మాండంగా గణేశ్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్ట పరిచేలా సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చాం. వరుణదేవుడి ఆశీస్సులతో వర్షాలు పుష్కలంగా పడి అన్ని జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. త్వరలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. గతేడాది వచ్చిన బుడమేరు వరదను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్నాం. బుడమేరుకు వరద రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నాం. 72 అడుగుల అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డూండీ సేవా సమితి సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జన ఏర్పాట్లు చేయడం చాలామంచి కార్యక్రమం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

No comments:
Post a Comment