Trishul News

అనుమానస్పద స్థితిలో ముగ్గురు మృతి..!

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేగింది. కుటుంబంలో తల్లి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మురళి(24) అదే గ్రామానికి చెందిన స్వాతి(19)ని ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. ఐదు నెలల క్రితం వీరికి కుమార్తె జన్మించింది. ఐదు రోజుల క్రితం స్వాతి పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చింది. ఆదివారం భార్య, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి శరీరంపై ఉన్న గాయాలను బట్టి గొంతు నులిమి చంపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన జరిగాక అదే ఇంట్లోని మరో గదిలో మురళి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ముగ్గురి మృతిపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలానికి అల్లూరు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి చేరుకొని ఈ ముగ్గురి మృతికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలా? లేదా ఎవరైనా హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post