Trishul News

ఆడపిల్లలు పుట్టారని అరాచకం..!

- పెళ్ళాం పిల్లలను ఇంట్లో నుంచి గెంటేసిన శాడిస్టు భర్త
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : 
ఆడపిల్లలు పుట్టారని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ముగ్గురు పిల్లలను భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో బాలింత అయిన భార్య అత్తారింటి ముందు ధర్నాకు దిగింది

కాలం మారుతోంది. టెక్నాలజీ పరుగులు పెడుతోంది. స్త్రీలు, పురుషులు అన్న భేదం మరచి ఈ సాంకేతిక యుగంలో దూసుకెళ్తున్నారు రోదసీలోకి కూడా మహిళలు ప్రయాణిస్తున్నారు. ఈ రంగం.. ఆ రంగం అనే తేడా లేకుండా ప్రతి రంగంలోనూ తమదైన రీతిలో ‌విజయాలు అందుకుంటున్నారు. ఇంట్లో మాత్రం నెగ్గుకు రాలేకపోతున్నారు. ఏదో వంకతో మహిళలను ఫ్యామిలీ మెంబర్స్ వేధిస్తున్న సంఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. ముఖ్యంగా భర్త స్థానంలో ఉన్న వ్యక్తి సతాయింపులు భరించ లేక బయటకు వస్తున్న ఆడవాళ్లు ఎందరో అలాంటివారిలో స్వప్న ఒకరు

మహిళలు ఎన్నో రంగాల్లో సత్తా చాటుతున్నా.. కొడుకుల్లేని ఇంటికి వారే కొడుకులా మారి తల్లిదండ్రులను చూసుకుంటున్నా.. కొందరు తండ్రుల బుద్ధి మాత్రం మారడం లేదు. అలాంటి బ్యాచ్‌లో గోరెంకా శ్రీకాంత్ ఒకడు. హైదరాబాద్ శివారులోని సైదాబాద్ ఇంద్రప్రస్తాన్ కాలనీలో ఉంటున్నాడు. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. చదవులు అయితే ఉన్నతంగానే ఉన్నాయి కానీ, బుద్ధి మాత్రం అతఃపాతాళంలోనే ఉండిపోయింది. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగమే అయినా.. తను అస్సలే సాఫ్ట్ కాదు. 2014లో స్వప్న అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్నందుకు 12 లక్షల రూపాయల కట్నం, 25 తులాల బంగారం తీసుకున్నాడు. వీరికి మొదటి కాన్పులో ఆడ పిల్ల పుట్టింది. ఆడ పిల్ల తనకు వద్దంటూ నిండు చూలాలు అయిన భార్యను, అప్పుడే పుట్టిన పసికందును ఇంట్లో నుంచి గెంటేశాడు. 

పెద్దల సమక్షంలో రాజీ..

పసికందును, బాలింతను ఇంట్లో బయటకు గెంటేసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన గోరెంకా శ్రీకాంత్‌తో పెద్దలు మాట్లాడారు. వారి సమక్షంలోనే రాజీ కుదిరింది. అందరూ చెప్పడంతో ఇష్టం లేకపోయినప్పటికీ భార్యను పసికందును ఇంట్లోకి రానిచ్చాడు. భర్త మారాడని భార్య స్వప్న సంబర పడింది. కానీ శ్రీకాంత్‌లోని ఆ మృగం నిద్ర మాత్రమే పోయిందని.. అది ఏనాటికైనా లేస్తుందని గమనించలేకపోయింది ఆ మహిళ.

రెండో కాన్పులోనూ ఆడపిల్ల..

ఇటీవల స్వప్నకు రెండోసారి కాన్పు జరిగింది. ఈసారి కవలలు జన్మించారు. అందులో ఒకరు ఆడపిల్ల కాగా, మరొకరు మగ పిల్లాడు. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో గోరెంకా శ్రీకాంత్ మరింత వెర్రెక్కిపోయాడు. భార్య స్వప్నను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. బాలింత అని కూడా చూడకుండా స్వప్నను, ఇద్దరు పసికందులను, మరో చిన్నారిని కట్టుబట్టలతో గెంటేశాడు. మారాడనుకున్న భర్త ఇలా చేసే సరికి స్వప్నకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న స్వప్నకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. ఆమె తరఫున సైఫాబాద్ ఇంద్రప్రస్తాన్ కాలనీలోని గోరెంకా శ్రీకాంత్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఇదేమీ పట్టని సాఫ్ట్ వేర్ శ్రీకాంత్.. మహిళలు చేస్తున్న ధర్నాను మేడపై నుంచి వీడియో తీస్తూ ఎంజాయ్ చేశాడు. అది చూసిన మహిళా సంఘాలకు చిర్రెత్తుకొచ్చింది. మహిళా సంఘాలు ఆగ్రహంతో ఇంట్లోకి చొచ్చుకు వెళ్లారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు మహిళ సంఘాల జోక్యంతో రాజీ కుదిర్చి స్వప్నను ఇంట్లోకి పంపించారు.

Post a Comment

Previous Post Next Post