విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
ఈనెల 25న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు విజయవాడలో ప్రభుత్వం ప్రత్యేకంగా క్రిస్మస్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు. వేదికపై ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఇతర నేతలు ఆశీనులు అయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల ఈరోజు ఈ స్థానంలో ఉన్నామని అభిప్రాయపడ్డారు. దేవుడు ఎంత గొప్ప వాడో చాలా మంది తన కంటే చక్కగా చెప్పగలుగుతారని తెలిపారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా ఒదిగి ఉండాలని.. ప్రజల సేవకులుగా ఉండాలని ఆకాంక్షించారు. మరింతగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావాలని దేవుడిని కోరుకుంటున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. మరోవైపు మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అభినవ శాంతా క్లాజ్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసలు కురిపించారు. దేవుడి దీవెనలు జగన్కు అండగా ఉన్నాయని.. ప్రతిపక్షాల కుట్రలు పని చేయవని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. మనం అందరం జగన్కు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.