నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నగర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛ నెల్లూరు సాకారానికి కృషి చేయాలని అధికారులు, సిబ్బందిని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 21 వ డివిజన్ మాగుంట లే అవుట్, వనంతోపు తదితర ప్రాంతాలను కమిషనర్ బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికంగా ఉన్న వివిధ వీధుల్లో డ్రైను కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని, దోమల నిర్మూలనకు మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్థానికంగా ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రజా పార్కును సందర్శించిన కమిషనర్ పార్కులో అవసరమైన మౌలిక వసతులు, క్రీడా వ్యాయమ సామగ్రిని వెంటనే అందుబాటులోకి తేవాలని సూచించారు. పార్కులో పచ్చదనం పెంచేందుకు, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మొయిళ్ళ గౌరి, నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.