Trishul News

బాబాయి మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్న - జూ. ఎన్టీఆర్

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
ప్రముఖ నటుడు చలపతిరావు హఠాన్మరణంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నటుడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ చలపతిరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటోన్న ఆయన అక్కడి నుంచి చలపతిరావు కుమారుడు రవిబాబుకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. మీరు మరణించారనే వార్త జీర్ణించుకోలేక పోతున్నామంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా ట్విటర్‌ వేదికగా చలపతిరావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు తారక్‌.. ‘చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన’ అని ట్వీట్‌ చేశారు తారక్‌. కాగా ఆది సినిమాలో ఎన్టీఆర్‌ బాబాయిగా చలపతిరావు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అందులో చలపతిరావు చనిపోయిన సన్నివేశంలో ‘లే బాబాయి.. లే’ అంటూ బిగ్గరగా ఏడుస్తాడు. ఈ నేపథ్యంలో చలపతిరావు మరణం నేపథ్యంలో నెటిజన్లు ఈ సీన్లను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కాగా మరో నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ ట్విట్టర్‌ వేదికగా చలపతిరావుకు నివాళి అర్పించారు. ‘ చలపతిరావు బాబాయి అంటే నాకు ఒక వ్యక్తిగా, నా కుటుంబానికి కూడా చాలా ఇష్టం. ఆయన ఆకస్మిక మరణం మా కుటుంబం మొత్తాన్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నష్టాన్ని పదాలలో వివరించలేవు. ఆయన కుటుంబానికి ఈ బాధను అధిగమించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని నివాళి అర్పించారు.

Post a Comment

Previous Post Next Post