Trishul News

జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు - చంద్రబాబు

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఈ జీవోపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును నిలిపివేయాలంటూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవో నెం.1పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జీవో నెం.1పై హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు. హైకోర్టులో విచారణ ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని జగన్ వృథా చేస్తున్నారని విమర్శించారు. జీవో నెం.1ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్ షోలకు సంబంధించిన అనుమతులపై ప్రభుత్వం జీవో నెం.1 తీసుకువచ్చింది. ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా, జీవో నెం.1ను హైకోర్టు ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. అదే రోజున హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. అయితే ఈలోపే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అబాసుపాలైంది.

Post a Comment

Previous Post Next Post