కడప, త్రిశూల్ న్యూస్ :
మంగళవారం నుంచి మూడు రోజుల పాటు కడపలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు అన్ని ఏర్పాట్లు తుది దశకు వచ్చాయి. రేపు మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణతో పాటు తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాలు, 6 సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు, యుగపురుషుడు ఎన్టీఆర్కు నివాళి, ఆరు సూత్రాలపై చర్చలో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. తొలి రోజు ఉదయం ఎనిమిదిన్నరకు ప్రతినిధుల నమోదుతో మహానాడు పండుగ ప్రారంభం కానుంది. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ప్రారంభించనున్నారు. తర్వాత పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. మా తెలుగు తల్లికి గీతాలాపనతో కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు మహానాడు వేదిక ద్వారా సంతాపం తెలపనుంది. ప్రధాన కార్యదర్శి నివేదిక అనంతరం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుల స్వాగత ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుల ప్రసంగం అనంతరం తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాలపై మాహనాడు వేదిక ద్వారా చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణే ధ్యేయంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. భోజన విరామం అనంతరం ఆరు సూత్రాల్లో మొదటిదైన కార్యకర్తే అధినేత అంశంపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కుటుంబ సాధికార సారథి, క్యూబ్స్, మై టీడీపీ యాప్తో పాటు శ్రేణుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చిస్తారు. సాయంత్రం ఆరు సూత్రాల్లో రెండోదైన యువగళం అంశంపై చర్చ ఉంటుంది. ఇందులో భాగంగా యువత సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ- వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, ప్రజా పాలనలో సాంకేతిక విజ్ఞానం-వాట్సప్ గవర్నెన్స్పై చర్చలు జరగనున్నాయి. మహానాడు రెండో రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా యుగపురుషుడికి మహానాడు వేదిక ద్వారా ఘన నివాళి అర్పించనున్నారు. అదే రోజు ఆరు సూత్రాల్లో భాగంగా కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై ప్రధానంగా చర్చించనున్నారు. తెలుగుజాతి – విశ్వఖ్యాతి అంశంపై కీలక చర్చ జరగనుంది. ఇందులో భాగంగా సంస్కరణల్లో మేటి ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలో ప్రగతిపథంలో రాష్ట్రం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, తెలుగుదేశం ఘన విజయాలు-40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంపై కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు.
పలు అంశాలపై చర్చలు
భోజన విరామం అనంతరం స్త్రీ శక్తి అంశంపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా మహిళా సంక్షేమం, సాధికారత, పటిష్టంగా శాంతిభద్రతలు అంశాలపై చర్చలు జరగనున్నాయి సాయంత్రం సామాజిక న్యాయం-పేదల ప్రగతిపై చర్చిస్తారు. పేదిరికం లేని సమాజం పీ4 సంకల్పం, స్వర్ణాంధ్ర విజన్@2047 సాధన దిశగా, గృహనిర్మాణం, అందరికీ అందుబాటులో విద్య, వైద్యం విషయాలపై చర్చలు జరుపుతారు. అదే రోజు చివర్లో అన్నదాతకు అండ అనే అంశంపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం, శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ రంగంలో విప్లవాత్మక నిర్ణయాలపై చర్చించి తీర్మానించనున్నారు. తీర్మానాల అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణం, ప్రసంగ కార్యక్రమాలు జరుగనున్నాయి. పలు రాష్ట్రాల్లో వరుసగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఎన్నిక అవుతుండటం, అందువల్ల అక్కడ జరుగుతున్న సుస్థిరాభివృద్ధితో ఆయా రాష్ట్రాలు ముందువరుసలో ఉంటున్నాయి. రాష్ట్రంలోనూ సుస్థిర ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందనే విషయాన్ని కడప గడ్డపై జరిగే 3 రోజుల మహానాడు వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధమైంది. మహానాడులో మూడోరోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలుగుదేశం కసరత్తు చేస్తోంది. 27, 28 తేదీల్లో ప్రతినిధుల సభ, వివిధ తీర్మానాలపై చర్చ, ఆమోదం తెలపనుండగా 29న బహిరంగ సభ మాత్రమే జరగనుంది.

No comments:
Post a Comment