- ఎన్టిఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన సిఎస్,కార్యదర్శులు
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతి మే 28వ తేదీని ప్రతి ఏటా రాష్ట్ర వేడుకగా రాష్ట్రమంతటా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.ఆమేరకు బుధవారం ఎన్టిఆర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఎన్టిఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, సియం ముఖ్య కార్యదర్శి యం.రవిచంద్ర, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు తదితర అధికారులు ఎన్టిఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావు ప్రఖ్యాత తెలుగు నటుడుగానే కాకుండా రాజకీయ జీవితంలో కూడా ఆదర్శవంతంగా నిలిచారని గుర్తు చేశారు. పేద ప్రజల సంక్షేమానికి అనేక వినూత్న కార్యక్రమాలకు నాంది పలికారని పేర్కొన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టి రామారావు తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలవడం తోపాటు తెలుగు సినీ రంగంలో చెరగని ముద్ర వేయడమేగాక రాజకీయ రంగం ద్వారా ప్రజలకు ఆయన చేసిన ఎనలేని సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా మే 28న ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సామాజిక న్యాయం, వికేంద్రీకరణ మరియు ప్రజా కేంద్రీకృత పరిపాలన, అన్నిటికంటే ముఖ్యంగా పేదలందరికీ పక్కఇళ్ళ నిర్మాణం, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి అనేక మార్గదర్శక సంక్షేమ పథకాలకు ఎన్టిఆర్ శ్రీకారం చుట్టారు. అంతేగాక తెలుగు జాతి గౌరవాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడంలో ఎన్టి రామారావు ఎంతో కృషి చేశారు. ఆయన సేవలకు గుర్తుగా ఆయన జ్ణాపకార్ధం ఎన్టిఆర్ కు తగిన గౌరవాన్ని ఇచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎన్టి రామారావు జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టిఆర్ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.

No comments:
Post a Comment