- నాడు వైసీపీ పాలనలో శ్రీ కొట్టే సాయిప్రసాద్ ని నడి రోడ్డుపై అవమానించిన పోలీసు అధికారిణి
- సాయికి అండ నిలుస్తూ తిరుపతి ఎస్పీ దగ్గర ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్
శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ :
జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ బాటలో నడిచిన సామాన్య కార్యకర్తకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కింది. శ్రీకాళహస్తికి చెందిన కొట్టే సాయి ప్రసాద్ ను జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ కి ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సాయి ప్రసాద్ పేరును ప్రకటించింది. వైసీపీ పాలన ఉండగా 2023లో శ్రీకాళహస్తిలో జనసేన పక్షాన ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమం చేపట్టిన కార్యకర్తలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ సందర్భంలో కొట్టే సాయిపై అప్పటి సీఐ అంజు యాదవ్ దాడి చేసి అవమానించారు. ఆమె కొడుతున్నా కదలకుండా అలాగే నిలుచుండిపోయారు. ఆ ఘటన జరిగిన రోజున తాడేపల్లిగూడెం సమావేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు. ఆ తరవాత కొట్టే సాయిని, నాయకులను వెంటబెట్టుకొని తిరుపతి వెళ్ళి జిల్లా ఎస్పీని కలిసి పోలీసుల చర్యపై ఫిర్యాదు చేశారు. ఆ రోజు పోలీసులు కొట్టినా ప్రజాస్వామ్యయుతంగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన కొట్టే సాయిని పవన్ కళ్యాణ్ గుర్తించి నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం నిలిచే కార్యకర్తలు, నాయకులను గుర్తించి తగిన బాధ్యతలు ఇచ్చే దిశగా పవన్ కళ్యాణ నిర్ణయాలు తీసుకొంటున్నారు అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.

No comments:
Post a Comment