తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో అత్యంత బాధ్యతతో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రక్రియను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన అధికార దాహంతో అపహాస్యం చేస్తుందని సిడబ్ల్యూసి సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నికల నిర్వహణ, ఓట్ చోరీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కును అధికార దాహంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అక్రమంగా కాల రాస్తోందని మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాందీ సాక్షాధారాలతో సహా బయటపెట్టారని వెల్లడించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న, జరిగిన ఎన్నికల తీరు, వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బిజెపి ప్రభుత్వం చేస్తున్న మోసాలు బయటపడుతున్నాయని వివరించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీని సాధించిందని చెప్పారు. అయితే అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి నమ్మలేని విధంగా బిజెపికి ఎక్కువ ఓట్లు రావడం గమనించాల్సిన విషయమని తెలిపారు. ఇది ఏ ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాలేదని అన్ని నియోజక వర్గాల్లోనూ బిజెపికి ఓట్లు అత్యధికంగా ఎలా వచ్చాయో ఆ పార్టీ చెప్పాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో తమకు అనుకూలమైన ఓట్లను కొనసాగించడం కొత్త ఓట్లను చేర్చడం, ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుకూల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లను గల్లంతు చేయడం గుర్తించడం జరిగిందన్నారు. ఇదే తరహాలో కర్ణాటకలో జరిగిందని, బీహార్లో 60 లక్షల ఓట్లు అదృశ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిలదీస్తూనే ఉన్నారని చెప్పారు. ఇలా ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ దొంగ ఓట్లను చేరుస్తూ అర్హులైన వారి ఓట్లను తొలగిస్తూ ఎన్నికల ప్రక్రియను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన నిలదీశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరుగుతుందని ఇందులో ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా మరో పోరాటం తీవ్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. విలేకరుల సమావేశం ప్రారంభానికి ముందు ప్రెస్ క్లబ్లో మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రీల జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ప్రెస్ క్లబ్ వద్ద ఓట్ చోరీ తీరును నిరసిస్తూ ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాల గురవం బాబు, పిసిసి ఉపాధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్, పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఐరాల లోకేష్, పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త సోమశేఖర్ రెడ్డి, పూతలపట్టు సమన్వయకర్త పూతలపట్టు ప్రభాకర్, తిరుపతి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కళిందర్, పిసిసి బీసీ సెల్ మాజీ కార్యదర్శి బైలు గోపి గౌడ్, తిరుపతి నగర కమిటీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కేకేసి తిరుపతి అధ్యక్షుడు చిరంజీవి, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు బోయన నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment