Trishul News

తెలంగాణలో 15 రోజులు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు - సీఎం కెసిఆర్

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్య్ర స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు మొదలు కొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు యువతీ యువకులు, యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని సీఎం కేసీఆర్​ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 1 కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జండాలను ఉచితంగా పంపిణీ చేయాలని సీఎంఆదేశించారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ' స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం ' కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలు వాటి అమలు తీరుపై సీఎం కేసీఆర్​ అధ్యక్షతన కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ప్రతి ఇంటి పై జాతీయ జెండా..
'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం' లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే రోజు వారీ కార్యక్రమాలను సమీక్షించారు. ఆగస్టు 15 న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిఇంటి పై జాతీయ జెండా కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యలను సిఎం కెసిఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి 9వ తేదీనుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలు గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో జరగాలన్నారు. వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని ఆగస్టు 8న హైదరాబాద్లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆర్మీ/పోలీస్‌ బ్యాండ్‌తో రాష్ట్రీయ శాల్యూట్‌.. జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం స్వాగతోపన్యాసంతోపాటు, అధ్యక్షుల తొలి పలుకుల తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగం, వందన సమర్పణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, అన్ని జిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌వోడీలు, జిల్లా కేంద్రాల్లో ఉండే ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, ఆర్మీ వాయుసేన తదితర రక్షణ రంగానికి చెందిన కమాండర్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యాధికారులు మొత్తంగా రెండు వేల మంది ఆహూతుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగస్టు 08: ప్రారంభ సమారోహం.
ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం.
ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామాల్లో మొకలు నాటడం, ఫ్రీడం పారుల ఏర్పాటు.
ఆగస్టు 11: ఫ్రీడం రన్‌ నిర్వహణ.
ఆగస్టు 12: రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల
ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి.
ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ
సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు..
ఆగస్టు 14: సాయంత్రం.. సాంస్కృతిక సారథి కళాకారుల చేత
నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక, జానపద
కార్యక్రమాలు. ప్రత్యేకంగా పటాకులతో వెలుగులు.
ఆగస్టు 15: స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ.
ఆగస్టు 16: 'ఏకకాలంలో ఎక్కడివారక్కడ 'తెలంగాణ వ్యాప్తంగా
సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం
కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.
ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ.
ఆగస్టు 18: ఫ్రీడం కప్‌ పేరుతో క్రీడల నిర్వహణ.
ఆగస్టు19: దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు,
జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ.
ఆగస్టు 20: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీ.
ఆగస్టు 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతోపాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం.
ఆగస్టు 22: ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.

» బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, స్టార్‌ హోటళ్లు, దవాఖానలు, షాపింగ్‌మాల్స్‌లో ప్రత్యేక ఆలంకరణలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.

» ప్రభుత్వ భవనాలు ఇతర ప్రతిష్ఠాత్మక భవనాలు, ఇతర ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో ఈ పదిహేను రోజులపాటు విద్యుత్‌ దీపాలు, ప్రత్యేక ఆలంకరణలను ఏర్పాటుచేయాలి. జాతీయ జండా ఎగురవేయాలి.

» ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు, ఉపన్యాస పోటీ , వ్యాస రచన పోటీ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించాలి.

» ఉపాధ్యాయులు, లెక్చరర్లకు దేశభక్తిపై కవితారచన పోటీలు నిర్వహించాలి.ప్రతిరోజూ ప్రార్థన సమయంలో అన్ని రకాల విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి.

» రిచర్డ్‌ అటెన్‌ బరో నిర్మించి దర్శకత్వం వహించిన 'గాంధీ' సినిమాను రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో.. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులు వీక్షించేలా ప్రతిరోజూ ఒక షో ప్రదర్శించాలి.

» గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం కప్‌ పేరుతో ఆటల పోటీలను నిర్వహించాలి. విజేతలకు బహుమతులు ప్రదానం చేయాలి.

» వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారిని కలుపుకొని ప్రత్యేక ర్యాలీలు నిర్వహించాలి.

» ఈ పదిహేను రోజుల వేడుకల్లో ఒక రోజున రాష్ట్రమంతటా ఏక కాలంలో ఎకడివాళ్లు అక్కడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన 'జరిపించాలి.

 » ఇందుకు పోలీసుశాఖ బాధ్యత వహించాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు.

» స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలు, ముషాయిరాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

» వన మహోత్సవం పేరుతో మొకలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి.

» ఫ్రీడం పారులను ఏర్పాటు చేయాలి. యువతీయువకులు క్రీడాకారులు ఇతర వర్గాల భాగస్వామ్యం తో ఫ్రీడం 2 కే రన్‌ నిర్వహించాలి.స్వాతంత్య్ర స్ఫూర్తిని రగలించే విధంగా బెలూన్ల ప్రదర్శన.

» రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలను నిర్వహించాలి.దవాఖానల్లో, అనాథ శరణాలయాల్లో, జైళ్లల్లో, వృద్ధాశ్రమాలల్లో పండ్లు, స్వీట్లు పంచాలి.

» వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌, జిల్లాపరిషత్‌, మున్సిపల్‌ సహా అన్ని రకాల స్థానిక సంస్థలు (లోకల్‌ బాడీలు) ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

» వజ్రోత్సవ సమావేశాల్లో స్వాతంత్య్ర పోరాట వీరులకు ఘన నివాళ్లు అర్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

» వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 15 ఆగస్టుకు ముందురోజు, 14న తాలుకా, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఘనంగా పటాకులతో వెలుగులు విరజిమ్మేలా కార్యక్రమాలను నిర్వహించాలి.

» జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షుడిగా, కలెక్టర్‌ కన్వీనర్‌గా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు.. సభ్యులుగా ప్రత్యేక నిర్వహణ కమిటీలు వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

» దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులతో ప్రత్యేక సంగీత విభావరిని నిర్వహించాలి.

» సమాజంలోని అట్టడుగు వర్గాలను, నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ అన్నారు.

» జిల్లాకొక ఉత్తమ గ్రాపంచాయతీని, మున్సిపాలిటీని, పాఠశాల, ఉత్తమ రైతు, డాక్టర్‌, ఇంజినీరు, పోలీస్‌ అధికారి, తదితర ఉద్యోగులు, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సతరించాలి

» రవీంద్రభారతిలో 15 రోజులపాటు స్వాతంత్య్ర సమర స్ఫూర్తి ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి.

Post a Comment

Previous Post Next Post