- వాలంటీర్లు వారంలో మూడు రోజులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
- జిల్లా కలెక్టర్ హరినారాయణన్
ఎస్ఆర్ పురం, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందజేసేందుకు సచివాలయ సిబ్బంది మరింత సమర్థ వంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు, పద్మా పురం సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సచివాలయాల్లో అర్హుల అనర్హుల జాబితాలను పరిశీలించి అనర్హతకు గల కారణాలను సచివాలయ సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేసే విషయంలో సచివాలయ సిబ్బంది విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనపై తనిఖీ చేయాలని ఎటువంటి సమస్యలున్న సంబంధిత యాప్ నందు అప్లోడ్ చేయాలని మరియు ప్రధానో పాధ్యాయులకు సమాచారాన్ని అందివ్వాలన్నారు. వాలంటీర్లు వారంలో మూడు రోజులు బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి అని తెలిపారు.
Tags:
చిత్తూరు