చీలీ, త్రిశూల్ న్యూస్ :
చిలీలోని ఓ మైనింగ్ ప్రాంతంలో అధికారులు ఓ భారీ సింక్హోల్ను గుర్తించారు. ఆ సింక్హోల్ చుట్టుకొలత దాదాపు 25 మీటర్ల (82 అడుగులు) ఉందని చెప్పారు. అలాగే, దాని లోతు దాదాపు 200 మీటర్లు (656 అడుగులు) ఉంటుందని తెలిపారు. భూగర్భంలో జరిగే మార్పుల కారణంగా సింక్హోల్ ఏర్పడుతుంది. భూమి కుంగిపోయినట్లు కనపడుతుంది. భూగర్భజలాల తీవ్ర ఉద్ధృతి వేళ భూమి ఉపరితలం కింద కోత ఏర్పడి, ఆ ప్రాంతం పెళుసుబారి పెద్ద గోతిలా ఏర్పడుతుంది. చిలీ రాజధాని శాంటియాగోకు ఉత్తరం వైపు 665 కిలోమీటర్ల దూరంలోని కాపీయాపోలోని టీర్రా అమరిల్లా నగరంలో ఓ మైనింగ్ ప్రాంతం ఉంటుంది. కెనడియన్ లుండిన్ మైనింగ్ సంస్థ ఇక్కడ మైనింగ్ పనులు నిర్వహిస్తోంది. అక్కడే ఆ సంస్థ సింక్హోల్ను గుర్తించింది. దీంతో చిలీ భూగర్భ, మైనింగ్ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి నిపుణులను పంపారు. ఆ సింక్హోల్లో ఎలాంటి పదార్థాలూ లేవని, కానీ, అందులో చాలా నీరు ఉందని అధికారులు తెలిపారు. మైనింగ్ ప్రాంతంలో గుర్తించి ఈ సింక్హోల్ వల్ల అక్కడి కార్మికులపై ఎలాంటి ప్రభావమూ పడలేదని లుండిన్ మైనింగ్ సంస్థ చెప్పింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోకి ఎవ్వరినీ వెళ్ళనివ్వట్లేదు. ఆ సింక్హోల్కు 600 మీటర్ల (1,969 అడుగులు) దూరం నుంచి ఇళ్ళు ఉన్నాయి. ఆ సింక్హోల్కు కిలోమీటరు వరకు జనసాంద్రత అంతగా లేదు. ఆ సింక్హోల్ను నాలుగు రోజుల క్రితం గుర్తించారు. దానికి సంబంధించిన అన్ని వివరాలను రాబట్టేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. కాగా, చిలీలోని 80 శాతం మైనింగ్ లుండిన్దే. మిగతా మైనింగ్ జపాన్కు చెందిన సుమిటోమో కార్పొరేషన్ చేతుల్లో ఉంది.
Tags:
అంతర్జాతీయం