తిరుమల, త్రిశూల్ న్యూస్ :
టీటీడీ ఆధ్వర్యంలో ఈ రోజు జరగాల్సిన సామూహిక వివాహాల కార్యక్రమం కళ్యాణమస్తు తాత్కాలికంగా వాయిదా పడింది. పేద హిందువులకు వివాహం భారం కాకూడదనే నిర్ణయంతో టీటీడీ ఈ పధకాన్ని 2007లో ప్రవేశ పెట్టి 2011 వరకు నిర్వహించింది. కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఈ పధకాన్ని ఆపివేశారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కార్యక్రమాన్ని పునురుధ్దరించే ప్రయత్నంలో భాగంగా టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రకటించింది. శ్రావణశుధ్ద దశమి ఆదివారం ఆగస్టు 7 వతేదీ ఉదయం గం.08-07 నిమిషాలకు వివాహాలు జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవటంతో టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన అనంతరం తిరిగి టీటీడీ కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది. టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పటికే చాలామంది సామూహిక వివాహాలకు జిల్లా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, కళ్యాణమస్తు వాయిదాపై టీటీడీ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. త్వరలోనే మరో ముహూర్తం నిర్ణయించి కళ్యాణమస్తును నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Tags:
తిరుమల