Trishul News

పేదవాడి సంక్షేమాన్ని దెబ్బతీసే కుట్రలు..!

                         వ్యాసకర్త
                    సి. రామచంద్రయ్య
         శాసన మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ 

దేశంలో, రాష్ట్రంలో మరో విష ప్రచారానికి తెరలేచింది. పేదవాళ్లకు అందుతున్న నగదు బదిలీలు, సంక్షేమ పథకాలకు అడ్డుకట్ట వేయకపోతే.. కొన్ని రాష్ట్రాల్లో శ్రీలంక ఆర్థిక సంక్షోభం తరహా పరిణామాలు ఉత్పన్నం అవుతాయట. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు.. ఇత్యాది ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలు తక్షణం జోక్యం చేసుకొని ఆయా రాష్ట్రాలకు ముకుతాడు వేసి సంక్షేమ పథకాలను నిలుపుదల చేసి పేదవాణ్ణి శిక్షించాలని కోరుతున్నారు కొందరు.

ఎంత దుర్మార్గం ఇది?! శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అక్కడి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆ ప్రభుత్వం అందించిన రాయితీలు, సంక్షేమ పథకాలు ఎంతమాత్రం కాదు. ఈ వాస్తవం శ్రీలంక ప్రజలకు తెలుసు. అధికారంలో ఉన్న వారు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే తమ దేశం దివాళా తీసిందని అక్కడి ప్రతిపక్ష పార్టీలు విమర్శించడాన్ని ఏవరైనా చూశారా, చదివారా? అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను విశ్లేషకుల అభిప్రాయాలు ఆవిధంగా ఉన్నాయా? మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టే చందంగా శ్రీలంక దేశంలోని సంక్షుభిత రాజకీయ పరిణామాలను మన దేశంలోని ఆంధ్రప్రదేశ్సహా మరికొన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితికి ముడిపెడుతున్నారు కొందరు కుహనా మేధావులు. ప్రజల ఆదరణ పొందిన ప్రభుత్వాలపై పనిగట్టుకొని బురద జల్లేందుకు అల్లిన ఇటువంటి కథనాలలో వాస్తవం లేదు. శ్రీలంక ఆర్ధిక, రాజకీయ సంక్షోభాన్ని బూచిగా చూపి ఇక్కడి పేదవాడి కంచంలోని అన్నం ముద్దను లాగేయాలని, పేద విద్యార్థులకు అందే నాణ్యమైన విద్యను దూరం చేయాలని, మధ్యతరగతి వర్గాలకు అందిస్తున్న నగదు బదిలీ వంటి పథకాలను రద్దు చేయాలని గగ్గోలు పెడుతున్నారు. న్యాయస్థానాలకు ఎక్కుతున్నారు. పేద వర్గాల వారిపై సంపన్న వర్గాలను ఎగదోసి, తాము కట్టే పన్నులన్నీ.. బడుగుబలహీన వర్గాల సంక్షేమానికే ఖర్చు చేసి అభివృద్ధి పనుల్ని అటకెక్కించారనే వాదనతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.

ఆశ్చర్యం ఏమిటంటే.. ఇప్పుడు దేశంలో చర్చంతా పేదలకు ఉచితంగా అందుతున్న సాయం చుట్టూనే తిరుగుతోంది తప్ప.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొండలా పేరుకుపోయిన నిరర్ధక ఆస్థులు (ఎన్పీఏలు) గురించి జరగాల్సినంత చర్చ జరగడం లేదు. 12 లక్షల కోట్లకుపైగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి మొండి బకాయిలుగా మార్చిన ప్రబుద్ధులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఎవరూ చర్చించడం లేదు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటీకరించడంపైన; వాటి ఆస్థుల్ని కారుచౌకగా అమ్ముతున్న వైనంపైన కూడా జరగాల్సినంత చర్చ జరగడం లేదు. సెజ్ల పేరుతో, పారిశ్రామికాభివృద్ధి పేరుతో గత ప్రభుత్వాలు విలువైన ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వల్ల జరిగిన నష్టం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. పేద వర్గాల జీవన ప్రమాణాలను పెంచడానికి చర్యలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అరవింద్ క్రేజీవాల్ వంటి ప్రజా నాయకులపై కొందరు మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ముప్పేట దాడి చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల వారు అందిస్తున్న సంక్షేమానికి గండి కొట్టాలని చూస్తున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఒత్తిడికి గురయ్యాయి. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వర్గాల ప్రజలు నలిగిపోయారు. ఈ వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుంచించుకుపోయాయి. దాంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు, వైద్యం ఖర్చులు తడిసిమోపెడు కావడంతో వారి జీవన ప్రమాణాలు ఊహించలేనంత దారుణంగా దిగజారాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు తమ ఆదాయం తగ్గినా కిందామీదా పడుతూనే కేంద్రం అనుమతించిన మేరకు రుణాలను స్వీకరిస్తూ వాటితో బాధిత వర్గాల ప్రజలను ఆదుకొంటున్నాయి. సంక్షేమ అభివృద్ధి పథకాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా ముందుకు సాగుతుంటే.. రాష్ట్రం అప్పుల్లో కూరుకొనిపోయి దివాళాతీసే దిశలో పయనిస్తోందంటూ దుష్ప్రచారం సాగిస్తున్నారు.

ఈ పథకాల వల్ల ఖర్చు తప్ప సంపద పెరగదని కొందరు పెదవి విరుస్తున్నారు. వారి దృష్టిలో అసలు సంపద అంటే ఏమిటి? సంపద అంటే పేదవర్గాల ఆర్ధికాభివృద్దే సంపద. అందుకే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మానవాభివృద్ధి, కుటుంబ సంక్షేమమే నిజమైన సంపద అని మనసావాచా నమ్ముతూ ఆ దిశలోనే నవరత్నాలను ప్రకటించి అమలు చేస్తున్నారు. అంతమాత్రంచేత అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా ఆపలేదు. ముఖ్యంగా, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రజల మధ్య ఆర్ధిక అంతరాలను తగ్గించడానికి కృషి చేస్తున్నారు.

ప్రముఖ ఆర్ధిక చరిత్ర కారుడు డేవిడ్ రాండెస్ 21వ శతాబ్దిలో ప్రపంచం ఎదుర్కొనే ఏకైక ప్రమాదం 'ధనిక పేద ప్రజలను విడదీసే సంపద, ఆరోగ్యాల మధ్య ఏర్పడే అంతరం మాత్రమే' అని పేర్కొన్నాడు. 2020లో యుఎన్ఎపి (UNDP) ప్రకటించిన మానవాభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచంలో ధనికులు, నిరుపేదల మధ్యనున్న ఆదాయాల నిష్పత్తి 1820లో 3:1 ఉండగా, 1913లో అది 11:1; 1970లో 30:1, 1990 లో 60:1; 2000లో 86:1; 2010లో 100:1; 2020లో 115:1 గా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సంపన్న వర్గాల ఆదాయం పెరుగుతుంటే, పేదల ఆదాయం స్థిరంగా అట్టడుగుస్థాయిలో నిలబడి పోయింది.

సమాజంలో సంపద పెరగాల్సిందే. అందులో రెండో అభిప్రాయం ఎవరికీ ఉండదు. సగటు జాతీయోత్పత్తి పెరిగితే దానిని అభివృద్ధికి కొలమానంగా గుర్తించే ప్రపంచబ్యాంకు, ఐఎఫ్ఎఫ్ తదితర ఆర్థిక సంస్థలు వేసే లెక్కలు తప్పని తేలింది. పేదరిక నిర్మూలనకు, దిగువ మధ్య తరగతి వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకు జాతీయ ఆదాయాన్ని పెంచడం ఒక్కటే మార్గం కాదని అంతర్జాతీయంగా రుజువైంది. జాతీయ సగటు ఆదాయాన్ని పెంచడంతోపాటు ఆ ఆదాయాన్ని సమాజంలో అట్టడుగు వర్గాలవారికి సమతుల్యతతో పంపిణీ చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమన్న సత్యం శాస్త్రీయంగా రుజువైంది. పేదరికాన్ని సూటిగా ఎదుర్కోవడానికి ఆర్ధిక, సామాజిక సంస్కరణలు చేపట్టి ఆయా వర్గాలను సాధికారులను చేయడం అనివార్యమని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, మరో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త మూన్ ఉల్హాక్ వంటి వారు చాలా కాలం క్రితమే చెప్పారు. అందుకు ప్రాథమిక, మాధ్యమిక ఉన్నత విద్యావిధానాలలో పూర్తిస్థాయిలో సంస్కరణలు చేయాలని, ఆరోగ్యరంగంలో రోగ నివారణ, వైద్యం, తల్లుల పౌష్టికాహారం, పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల సంక్షేమం మొదలైనవి. అత్యంత ప్రాధాన్యత అంశాలని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ చర్యలు చేపట్టింది. రైతులు, అసంఘటిత కార్మికులు, చేతివృత్తులపై ఆధారపడిన వారి ఆదాయాల్ని పెంచడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఢిల్లీలోని అమాద్మీ ప్రభుత్వంగానీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగానీ ఆ బాటలోనే నడుస్తున్నాయి. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం సైతం కొన్ని వినూత్న సంక్షేమ పథకాలుతోపాటు 'దళితబంధు' వంటి ప్రయోగాత్మక పథకాలను అమలు చేస్తోంది.

నిజానికి, ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం - సంక్షేమ రాజ్యస్థాపనే. ఈ 7 దశాబ్దాల కాలంలో కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ, అభివృద్ధి రంగాలపై ఖర్చు చేశాయి. అయినప్పటికీ దేశంలో వ్యవసాయ రంగం తిరోగమనంలో ఉంది. నిరుద్యోగం గరిష్టస్థాయికి చేరింది. ఖర్చు చేసిన నిధుల వల్ల అధికంగా ప్రయోజనం పొందిన వర్గాలేమిటి? ఎందుకు ఆర్థిక అంతరాలు అంతకంతకూ పెరిగాయి? సంపద పెంచామని చెప్పుకొంటున్న వారి పాలనలో ఎవరు బాగుపడ్డారు? ఏ ప్రాంతాలు అభివృద్ధి సాధించాయి? ఏ మేరకు ఆర్ధిక, సామాజిక అసమానతలు తగ్గాయి? రెండంకెల ఆర్ధికాభివృద్ధి నమోదు చేశామని గొప్పలు చెప్పుకొనే వారి పాలనలో పేదరికం ఒక్క శాతం కూడా ఎందుకు తగ్గలేదు? గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఎందుకు పెరిగాయి? రైతుల రుణభారం ఎందుకు పెరిగింది? విద్య, వైద్యం ఖరీదుగా మారి పేద, మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా మారిపోవడానికి కారణం ఏమిటి? ఇందుకు అవలంభించిన విధానాలను సమీక్షించాల్సిన అవసరం లేదా?

అధికారంలో ఉండగా పేద వర్గాలను సాధికారులుగా చేయకుండా వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినవారు.. ఇపుడు ఆ వర్గాలు అభివృద్ధిబాటలో పయనిస్తూ.. తమను ఆదరించిన పార్టీకి కృతజ్ఞతాపూర్వకంగా మళ్లి ఎన్నికలలో ఎక్కడ ఓట్లు వేస్తారేమోనని భయపడుతున్నారు. ఇపుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఢిల్లీలో అమలు జరుగుతున్న వినూత్న సంక్షేమ కార్యక్రమాల్ని ఎలాగైనా నిలుపుదల చేయించాలని కొన్ని విఫల యత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే.. ఆ పార్టీల్ని ప్రజలు క్షమిస్తారా?

Post a Comment

Previous Post Next Post