అమరావతి, త్రిశూల్ న్యూస్ :
శనివారం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఎల్లుండి రాష్ట్రపతి భవన్ లో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఈ రోజు సాయంత్రం హస్తినకు బయల్దేరనున్నారు. అయితే మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరి ఆముదాలవలసకు చేరుకుంటారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరు అవుతారు. అనంతరం సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్ వెళ్తారు. అక్కడ జరిగే నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం తిరుగు పయనమవుతారు. నీతి అయోగ్ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. సెస్ లు, పన్నుల్లో రాష్ట్రాల వాటాల గురించి మాట్లాడనున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు మంత్రులను కూడా కలిసే ఛాన్స్ ఉంది.
చంద్రబాబు కూడా....
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవం లో భాగంగా.. ఏడాది పాటు కార్యక్రమాలు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. దీని పైన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కేంద్రం నుంచి టీడీపీ అధినేతకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఫలితంగా శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నారు. మొత్తంగా ఇరు పార్టీల అధినేతలు ఢిల్లీ టూర్ ఖరారు కావటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు చంద్రబాబు ఎవరినైనా కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందా అన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:
ఆంధ్రప్రదేశ్