హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
కొన్ని వందల సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ సుస్థిరస్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు కైకాల ఇంటికి తరలివెళ్లి ఆయనకి నివాళులు అర్పించారు. 60 ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలతో దాదాపు 700 పైగా సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప పాత్రల్లో నటించి మెప్పించారు. శుక్రవారం నాడు ఆయన పార్థివ దేహాన్ని ఇంటివద్దే ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. నేడు శనివారం ఉదయం మహాప్రస్థానానికి అంతిమయాత్రగా తీసుకువెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కైకాల సత్యనారాయణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని శుక్రవారం నాడే ప్రకటించారు. నేడు ఉదయం 11 గంటలకి కైకాల పార్థివదేహం మహాప్రస్థానానికి అంతిమయాత్రగా వెళ్ళింది. మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. పోలీసులు ఆయనకి గౌరవ వందనం చేశారు. అనంతరం అయన పెద్ద కుమారుడు చితికి నిప్పు అంటించారు. కుటుంబసభ్యులు, ప్రముఖులు, అభిమానుల సమక్షంలో కైకాల అంత్యక్రియలు ముగిసాయి.