Trishul News

మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిని 15 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్‌..!

న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
మహిళల భద్రతను పరిశీలించేందుకు వెళ్లిన ఢిల్లీ మహిళా కమిషన్‌ (డిడబ్ల్యుసి) అధ్యక్షురాలు స్వాతి మాలివాల్‌కు భయంకర అనుభవం ఎదురైంది. ఓ కారు డ్రైవర్‌ ఆమెని 15 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. గురువారం తెల్లవారుజామున ఎయిమ్స్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేయడంతో పాటు కారు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతను పరిశీలిస్తుండగా మద్యం తాగిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించినట్లు స్వాతి మలివాల్‌ తెలిపారు. కారుతో వచ్చిన ఓ వ్యక్తి తనను వాహనంలోకి ఎక్కాలంటూ ఒత్తిడి చేశాడని, నిరాకరించడంతో... ముందుకెళ్లి యూటర్న్‌ తీసుకుని వచ్చి, మళ్లీ వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. అతనిని పట్టుకునేందుకు యత్నించగా.. కారు అద్దం పైకి ఎక్కించి, చెయ్యి ఇరుక్కుపోయేలా చేశాడని, సుమారు 15 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'దేశరాజధానిలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సనే సురక్షితంగా లేరంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి' అని ఆమె ట్వీట్‌ చేశారు.

Post a Comment

Previous Post Next Post