Trishul News

కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు స్వల్ప వర్ష సూచన..!

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
తెలుగు రాష్ట్రాలకు ఈ జనవరి చివరి వారంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా వర్ష సూచన ఏర్పడుందని వివరించారు. ప్రస్తుతం శ్రీలంకను ఆనుకొని ఓ ఉపరితల ఆవర్తన ప్రాంతం తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో వచ్చే 5 రోజులు ఎలాంటి వర్షాలు ఉండే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. పశ్చిమ గాలుల ప్రభావం బలపడుతుండడంతో పొడిగాలులు తమిళనాడు, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉంటాయని చెప్పారు. కాబట్టి, ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని, కానీ తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు. ఎప్పుడైనా చలి కాలం నుంచి ఎండా కాలం వెళ్లే కాలంలో కొన్ని వర్షాలు పడటం చాలా సహజం. గత పది సంవత్సరాల్లో ప్రతి సారి మనం జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఏదో ఒక నెలలో వర్షాలను చూశాము. ఈ సారి జనవరి చివరి వారంలో కొన్ని వర్షాలకు సంకేతాలు కనబడుతోంది. సాధారణంగా జనవరి చివరి వారానికి చలి తగ్గుముఖం పడుతూ మెల్లగా పగటి సమయంలో వేడి పెరుతుంది, అలాగే రాత్రి చల్లగా ఉంటుంది.

పశ్చిమ గాలుల ప్రభావం అంటే..
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మనకు ఎలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, అలాగే హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడ భూమిలోనే అల్పపీడనాలు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే చిన్నగా పశ్చిమ గాలులు అని అనవచ్చు. ఇది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం భాగా ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.

ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి..
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. సోమవారం (జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్ స్పెల్గా వ్యవహరిస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్ స్పెల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి. రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.

తెలంగాణ వాతావరణం..
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో నేడు కూడా అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. సాధారణంగా 11 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. హైదరాబాద్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. నగరంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30.4 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Post a Comment

Previous Post Next Post