Trishul News

విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి - జగన్ ఆదేశాలు


అమరావతి, త్రిశూల్ న్యూస్ :

ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆయన అదికారులకు సూచించారు. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్ నాటికి నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలని జగన్ అదికారులకు సూచించారు. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నామని. అందుకే సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిగ్రీ చదువుతున్న వారి నైపుణ్యాలను బాగా పెంచాలని సీఎం జగన్ అన్నారు. వివిధ కోర్సులను పాఠ్య ప్రణాళికలో ఇంటిగ్రేట్ చేయాలన్నారు. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులకు సూచించారు. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ ఉండాలని.. సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరిక్యులమ్లో భాగం కావాలని సూచించారు. ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుందని జగన్ చెప్పారు. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలన్నారు. స్వయం ఉపాధిని కల్పించే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టై అప్ చేసుకోవాలని సూచించారు. రిస్క్ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సుల పై దృష్టి పెట్టాలని,వచ్చే జూన్ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలని జగన్ సూచించారు. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతులు పరంగా నాణ్యత పెరగాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి విద్యా సంస్థ కూడా నాక్ అక్రిడిటేషన్ సాధించాలని, మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి చేయూత నివ్వాలన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో ప్రమాణాలు పెంచుకోవాలని, మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్ అక్రిడిటేషన్ సాధించేందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలన్నారు. అప్పుడే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కళాశాలల్లో కోర్సులన్నీ ఇవాళ్టి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలని జగన్ అన్నారు. కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్ పాలసీ ఉండాలని సూచించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. హై ఎండ్ స్కిల్స్లో భాగంగా.. సాప్ట్వేర్ స్కిల్స్ను కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్లాంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్ధులకు సర్టిఫికేషన్ ఉంటేనే ఎంప్లాయిమెంట్ పెరుగుతుందని,ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిపి కరిక్యులమ్ రూపొందించాలన్నారు. సోలార్ పార్క్లు, సోలార్ మోటార్లు, ప్యానెల్స్ రిపేరు రంగంలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉందని,ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాలన్నారు. ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలని,వచ్చే జూన్ లక్ష్యంగా ఈతరహా కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని సమావేశంలో చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్‌జీయూకేటీ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే సి రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Post a Comment

Previous Post Next Post