నడుకుడి, త్రిశూల్ న్యూస్ :
దాచేపల్లి మండలంలోని నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నల్ను ట్యాంపర్ చేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీకి పాల్పడిన ఘటన బుధవారం తెల్లవారుజామున కలకలం రేపింది. నాగర్సోల్ నుంచి నర్సాపురం వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఉదయం 2.47 గంటల సమయంలో నడికుడి స్టేషన్ సమీపంలోని 146/06 మైలురాయి వద్దకు చేరుకోగా, మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో దుండగులు సిగ్నల్ వ్యవస్థను చెడగొట్టారు. సిగ్నల్ ఎరుపు రంగులోకి మారడంతో లోకో పైలట్ రైలును ఆపివేశారు. ఈ సమయంలో దొంగల ముఠా రైలులోకి ఎక్కి ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లో ఉన్న ముగ్గురు మహిళల మెడలోని ఆభరణాలను అపహరించారు. 68 గ్రాముల బంగారు గొలుసులు, ఒక రోల్డ్ గోల్డ్ గొలుసును దోచుకున్నారు. ఎస్-5 బోగీలో చోరీకి యత్నిస్తుండగా ప్రయాణికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో రైలు సుమారు 35 నిమిషాల పాటు నిలిచిపోయింది. బాధితురాలు శ్రీదేవి (విజయవాడ) ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

No comments:
Post a Comment