Trishul News

వామ్మో మాయదారి కరోనా దేశంలోకి మళ్ళీ వచ్చేసింది..!

- వడోదరలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు వేరియంట్ సోకినట్లు అధికారులు ధృవీకరణ 
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
వామ్మో ఈ మాయదారి కరోనా మనల్ని ప్రశాంతంగా బ్రతికనిచ్చేలా లేదు. అవును.. కరోనా గురించి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది.ఇండియాలోకి ఒమిక్రాన్ BF-7 వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. చైనాలో ప్రస్తుతం ఉన్న దారుణ పరిస్థితులకు కారణమైంది ఈ వేరియంటే. గుజరాత్‌లోని వడోదరలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు ఈ వేరియంట్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. జీనోమ్‌ సీక్వెనింగ్‌లో వేరియంట్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గుర్ని ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటివరకు భారత్‌లో 3 ఒమిక్రాన్‌ BF-7 వేరియంట్‌ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా మరో కేసు ఒరిస్సాలో వెలుగుచూసింది. దీంతో వైద్యారోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్‌ టెస్ట్‌లు చేయాలని కేంద్రం ఆదేశించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కంపల్సరీగా కరోనా టెస్ట్‌లు చేయాలని అధికారులు ఆదేశించారు. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే గుణం ఉంది ఈ వేరియంట్‌కు. ఇంక్యుబేషన్‌ వ్యవధి కూడా తక్కువ. కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ అత్యున్నత స్ధాయి సమీక్ష నిర్వహించింది. కరోనా ముప్పు ఇంకా పోలేదని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ. రద్దీ ప్రాంతాల్లో జనం మాస్క్‌లను ధరించాలని కేంద్రం సూచించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. ప్రతి ఒక్కరు బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని సూచించింది. కొత్త వేరియంట్‌ కారణంగా కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టులో టెస్ట్‌లను కంపల్సరీ చేశారు.

చైనాలో అల్లకల్లోలం..!

ఒమిక్రాన్‌ BF-7 వేరియంట్‌ కారణంగానే చైనాలో .. కరోనా పరిస్థితి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. అధికార యంత్రాగం చేతులు ఎత్తేయడంలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అంబులెన్స్‌ల కోసం వేలాది ఫోన్‌ కాల్స్‌ రావడంతో తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ఆఖరికి కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా వెయిటింగ్‌ లిస్ట్‌ పెరిగిపోతోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BF.7 తోనే చైనాలో వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. బీజింగ్‌తో సహా పలు నగరాలలోని ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా కరోనాతో చనిపోయిన వాళ్ల శవాల గుట్టలే కన్పిస్తున్నాయి. కరోనాతో రానున్న రోజుల్లో లక్షలాదిమంది చనిపోయే అవకాశముందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో 60 శాతం జనాభాకు కరోనా సంక్రమించే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Post a Comment

Previous Post Next Post