నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
చారిత్రక నేపధ్యం కలిగిన స్వతంత్ర పార్కును సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేలా తీర్చిదిద్దాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. స్థానిక గాంధీబొమ్మ కూడలి సమీపంలోని పార్కును అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్కులో ఆహ్లాదాన్ని పెంచేందుకు అవసరమైన పచ్చదనం, మొక్కల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పార్కులో యువకులు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన వ్యాయమ పరికరాలు, ఆట వస్తువులు దెబ్బతిన్న కారణంగా నూతన పరికరాలను వెంటనే అమర్చాలని కమిషనర్ ఆదేశించారు. పార్కు ప్రాంగణం మొత్తం అనునిత్యం పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేకంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో బృందావనం రెసిడెన్షియల్ హౌసింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.