ఆదిలాబాద్, త్రిశూల్ న్యూస్ :
భార్య, భర్తల మధ్య ఏర్పడ్డ చిన్నపాటి ఘర్షణలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జైనథ్ మండలం బాలాపూర్ లో జరిగిన ఘటన వివరాలను పోలీసులు, గ్రామస్థులు వెల్లడించారు. గ్రామానికి చెందిన గణేశ్, సుష్మ భార్య భర్తలు. వీరికి ఆదిత్య(4), ఆర్యన్(2) పిల్లలున్నారు. బుధవారం మధ్యాహ్నం భార్యభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ జరగడంతో భార్య సుష్మ ఇద్దరు పిల్లలతో కలిసి బయటకు వెళ్లిపోయింది. సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లలను పడేసి ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు తల్లిని రక్షించగా చిన్నారులు మృతి చెందారు. తల్లి సుష్మ మతిస్థిమితం లేని కారణంగానే క్షణికావేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని గ్రామస్థులు పేర్కొన్నారు. చిన్నారుల మృతదేహాలు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్కు రిమ్స్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.